
Nomulu Vratalu-Cultural Festivals In English,Telugu,Sanskrit/Devanagari
ఏమిటీ వ్రతాలు నోములు:
నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా “ఇది నేను చేయవలెను, విడవరాదు” అనుకొనుట. దీనినే వ్రతము అని కూడా అంటారు. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.
తెలుగు భాషా ప్రాంతాలలో స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉంది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు ఉన్నాయి.
నోములు వ్రతాలు అనగానే స్త్రీలు చేసేవి అనే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. ఈ మాట కొంత వరకు నిజం. ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే. వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో, నోమో సిద్ధంగా ఉంటుంది.
కొద్ది కాలం క్రితం వరకు కొన్ని శతాబ్దాలుగా స్త్రీలు విద్యా విత్తాలకు దూరమయ్యారు. మగ పిల్లలు గురుకులాల్లోనో, వీధి బడుల్లోనో చదువుకునే వారు. బాల్య వివాహాలు జరిగేవి.ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా ఉన్నాయి. త్రిలోక సంచారియైన నారదుడు చెప్పినవి కొన్ని ఉన్నాయి. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.
ఆడ పిల్లలకి సత్ప్రవర్తన నేర్పటానికి వారి చేత నోములు, వ్రతాలు చేయించే వారు. పెళ్ళయిన వెంటనే చిన్నతనంలో చిట్టిబొట్టు( తిలక ధారణం యొక్క ప్రాశస్త్యాన్నితెలిపి, బొట్టు పెట్టుకోటం, పెట్టటం నేర్పటానికి), నిత్య శృంగారం (అలంకరించుకోటం, అలంకరించటాల్లో శిక్షణ) మొదలైన వ్రతాలతో ప్రారంభించి, పువ్వు తాంబూలం, పండు తాంబూలం అనే నోముతో సాటి వారికి భక్తి భావంతో ఇవ్వటం అనేది అలవాటు చేయటం జరిగేది. ఎక్కువ వ్రతాల ప్రయోజనం ఇదే.
ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట.
వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు తాంబూలాలు ముత్తైదువల కివ్వటం ఆచారంగా వస్తోంది. తాంబూలంలో ఉండే ఆకు, వక్క, సున్నం దానం చెయ్యటం వల్ల సూర్య, కుజ, చంద్ర దోషాలు పరిహారం అవుతాయి. నాన బెట్టిన పెసలు, శనగలు వాయినంలో ఇవ్వటం వల్ల బుధగ్రహ,గురు గ్రహ దోషాలు పరిహరింప బడుతాయి.
వ్రతాలు చాలా వరకు స్కాందపురాణాంతర్గతమైనవిగా కనపడతాయి. స్కందుడికి సంబంధించింది స్కాంద పురాణం. స్కందుడంటే కుమార స్వామి. జగన్మాత జగత్పితల ముద్దుల పట్టి అయిన కుమార స్వామి లోకంలోని జీవు లందరికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ జీవులందరి పక్షాన అందరికి తల్లి తండ్రులైన పార్వతి పరమేశ్వరుల వద్దకు వెళ్ళి, ఈతి బాధలతో సతమత మౌతున్న మానవులకు సంసార దుఃఖాన్ని పోగొట్ట గలిగిన దివ్యౌషధ మేదైనా తెలియ చేయ వలసిందని తల్లి పార్వతీ దేవిని ప్రార్థిస్తాడు. జగజ్జనని కుమారుడడిగిన దానిని భర్తకు నివేదిస్తుంది. కొన్ని వ్రతాలలో కుమారు డడగబోయే దానిని పార్వతీ దేవి అప్పటికే అడిగి ఉంటుంది. శివుడు భూలోక వాసులు పడుతున్న బాధలను పోగొట్టే వ్రతాన్ని పార్వతీదేవి సమక్షంలో కుమారస్వామికి ఉపదేశం చేస్తాడు. కుమారస్వామి అంటే జీవులందరి ప్రతినిధి. ఆయనకు ఉపదేశిస్తే భూలోకం లోని జనులందరికి ఉపదేశించినట్టే. కనుకనే వ్రతాలని మళ్ళీ మరెవరో ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. హాయిగా చేసెయ్యటమే!! కొడుకు చనవు కొద్దీ తల్లిని అడగటం ఆమె తండ్రికి చెప్పటం, ఆయన సమాధానం చెప్పటమో, అనుమతించటమో, ఆమోదించటమో సహజమే కదా!
సాధారణంగా ఆడవారు చేసే పూజలు, వ్రతాలు నోములు చాలా వరకు అయిదోతనం కోసం అయి ఉంటాయి. కొన్ని మాత్రం పిల్లలు కావాలనో, ఉన్న పిల్లలు బాగుండాలనో, వారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలనో చేయటం జరుగుతుంది. చిత్రమైన వాస్తవం ఏమంటే స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటీ తమ కోసం చేసుకొనేది లేదు. ఇంక చిత్రం ఏమంటే మహిళలు తమ భర్తల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం, పదోన్నతి కోసం అంటూ ఎన్నో వ్రతాలు, నోములు చేస్తారు గాని భార్య కోసం భర్త చేసే వ్రతం ఒక్కటి కూడా కనపడదు. దానికి తగిన కారణం ఉన్నదనుకోండి.
పదహారు ఫలాల నోము కథ మంచివి దానం చేస్తే వచ్చే ఫలితాన్ని, చచ్చువి పుచ్చువి దానం చేస్తే వచ్చే ఫలితాన్ని సోదాహరణంగా నిరూపిస్తుంది. ఈ కథ విన్న వారెవరూ పాడైన వస్తువులని దానం చేయటానికి సాహసించరు. తమ కున్న దానిని ఇతరులతో పంచుకోవటం, ఇతరులకు మంచివి మాత్రమే ఇవ్వాలని చెప్పటం, సాటి వారిలో తమ ఇష్ట దైవాన్ని చూడటం అలవాటు చెయ్యటం, సహనం, క్షమ మొదలైన గుణాలు పెంపొందించటం ఈ వ్రతాల లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ లక్షణాలున్న వారికి భగవదనుగ్రహం తప్పక లభిస్తుంది. వరలక్ష్మి వ్రత కథ ఈ అంశాన్నే నిరుపిస్తుంది.
హితంగా మితంగా మాట్లాడుతూ, గయ్యాళి కాక, అత్తమామల సేవ చేస్తూ, పతివ్రత అయిన చారుమతి (మంచి బుద్ధి కలిగినది) ని వరలక్ష్మి అనుగ్రహించి, కలలో కనపడి వర లక్ష్మి వ్రతం చెయ్యమంటుంది. అప్పటికి చారుమతి వరలక్ష్మిని పూజించ లేదు. అయినా ఆ తల్లి అనుగ్రహించిందంటే చారుమతి సత్ప్రవర్తనయే కారణం అనటంలో ఎటువంటి సందేహము లేదు. అటువంటి వరలక్ష్మి అనుగ్రహం పోందలనుకునే వారు చారుమతి లాగా మంచి నడవడిక కలిగి ఉండాలనే సూచన ఉన్నదీ వ్రతంలో. ఏ వ్రతమైనా అంతే!

Pingback: Stotras in english - StotraVeda.com